Saturday, 31 January 2015

ప్రత్యేక కథనం: భర్త అంటే మగాడు......



భర్త అంటే మగాడు.....

నేను మగాన్ని అనే అహంకారం నేటి 21 వ శతాబ్దంలో పూర్తిగా కనుమరుగయింది.. ముఖ్యంగా ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా వినబడే మాట.. నేను మగాన్ని 'నోరు మూసుకో' అని.... కానీ కాలం శాసించింది భర్తకి బంధం విలువ తెలిసొచ్చింది... బంధంతో పాటే బాద్యత ఉందని తెలుసుకున్నాడు... కాని భార్యతో కలిసి భర్త కొన్ని చిన్న చిన్న ఆనందాలను కోల్పోతున్నాడెమో అనిపిస్తుంది... భార్య పట్ల కొన్ని సార్లు అసహనం ఆవేశం ప్రదర్శించవచ్చు... ఆ అసహనం ఆమె ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయకూడదు... ఎందుకంటే భర్త అంటే భార్య మెడలో బంగారు తాడు వేసి భాధ్యత లేకుండా తిరిగేవాడు ఎంత మాత్రం కాదు.. అసలు నన్నడిగితే భర్త అంటేనే భాద్యత మల్లి భర్తకి నిర్వచనం అవసరం లేదు.. భర్త అంటే అన్ని తానే అయి భరించేవాడు కాదు ఇప్పుడు ఆ కాలంలో కూడా లేడు., భర్త అంటే బాధని పంచుకునేవాడు.. భర్త అంటే భార్య శరీరంలో సగ భాగం కాదు బాధల్లో కూడా సగ భాగం.. భర్త అంటే భారాన్ని మోసేవాడు... ఆ భారం భార్య కనుచూపు మేరలో కనిపించకుండా చేసేవాడు... భర్త అంటే భార్యకి మూరెడు మల్లెలు కొనివ్వటం కానే కాదు ఆ మూరెడు మల్లెల మధ్య జానెడు ప్రేమని పంచి ఇవ్వటం... భర్త అంటే శరీరాన్ని అనుభవించటం కాదు ఆ శరీరంలో కాలానుగుణంగా వచ్చే ఆరోగ్యమార్పులను అర్ధం చేసుకోవటం.. భర్త అంటే పిల్లలను కని ఇవ్వటమే కాదు ఆ పిల్లల పట్ల కనీసావసరాలను గుర్తేరగటం.. భర్త అంటే భార్య పట్ల చిరు కోపాన్ని ప్రదర్శించటమే కాదు భార్య చిన్ని చిన్ని కోరికలను తీర్చటం... భర్త అంటే భరణం తీసుకోవటం ఎంత మాత్రం కానే కాదు తన బలానికి భార్య బలం జోడించటం....

సమాజంలో కొన్ని విలువైన అనుబంధాలకు విలువ లేకుండా పోతుంది. మనకే కాదు ఎదుటి వాళ్ళకి ఓ మనసుందని మరిచి చెదిరిపోతున్నాయి మానవసంబంధాలు. ప్రేమలు లేవు లేవు ఆప్యాయతలు అంతకన్నా లేవు కాసుల వేటలో కరిగిపోతుంది కాలం ఓ కలలా..... కార్పోరేటు తీరు కుటుంబ వ్యవస్థలో, ఇంట్లో అందరూ ఉన్నా ఎవరికి వారు ఒంటరే..... భర్త ఇంటికి వచ్చ్హేవరకు తెలియదు భార్య ఇంట్లోనే ఉందని.., భర్త వస్తాడో రాదు తెలియదు భార్యకి..... అత్యవసరాలకి తప్ప ఆప్యాయంగా మాట్లాడుకోవటం మరిచారు నేటి కాలంలో...., ప్రేమైనా, కోపమైనా, ఆవేశమోచ్చినా, ఏ ఆలోచనొచ్చినా ఎదోచ్చినా సోషల్ మీడియా అనే వేదిక సృష్టించుకొని మరి పంచుకుంటున్నారు. లేకుంటే ఉందిగా అద్భుతమైన హాస్తాభరణం, క్షణాల్లో ప్రపంచాన్ని కళ్ళముందుంచే చరవాణి.... దానితోనే సహజీవనం చేస్తున్నాం. ఇంట్లో మన కోసం ఒకరున్నారని మరుస్తూ 'సహజీవనం' తో శాశ్వతంగా ముడివేసుకుంటున్నాము. మనిషి సాంకేతిక పరిజ్ఞానానికి అలవాటు పడటం తప్పేమీ కాకపోవచ్చు.., కాని సాంకేతిక పరిజ్ఞానాన్ని తనువు నిండా తగిలించుకొని సామాజిక సంబంధాలను విచ్చిన్నం చేస్తున్నాడు.

మన ముందు తరాల వారు ఎన్ని సందేహలోచ్చిన, ఎన్ని సమస్యలోచ్చినా, ఎంత కోపమొచ్చిన కానీవందేళ్ళు కష్ట సుఖాలని తమవిద్దరివే అనుకున్నారు... కాలాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు.. ఎన్ని అవాంతరాలు వచ్చిన.., ఎన్ని అవరోధాలు ఏర్పడినా అవన్నీ వారికి అడ్డు కాలేదు.. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి మనకు వెలకట్టలేని ఆలు మగల బంధం గూర్చి భవిష్యత్ తరాలకు నేర్పినటువంటి అటువంటి ఎందఱో మహా దంపతులకు శతకోటి వందానిభివందనాలు.... మన పూర్వపు తరాల స్పూర్తిగా.....

హరికాంత్

ఈ సంవత్సరం 2015 క్రొత్తగా సరిక్రొత్తగా......


గడుస్తున్న ఒక్కో సంవత్సరం ఒక్కో జ్ఞాపకం. ఈ సంవత్సరంలో కొన్ని తీపి జ్ఞాపకాలు కొన్ని చేదు జ్ఞాపకాలు... ఒక సంఘటనేమో సంతోషాన్ని సగటు సాటి మనిషి తో పంచుకొని ఆకాశమంత ఎత్తుకు దూకి అంతరిక్షమంత ఆనందాన్ని పంచుకునేదయితే ఇంకో సంఘటన అవని అంత దిక్కులు పిక్కేటేల్ల్లల అరచినా కాని ఆ ఆవేదన తీరనిది.  ఒక క్షణాన్ని పోగొట్టుకుంటే వెతుక్కోవటానికి జీవిత కాలం పడుతుంది. ఒక జ్ఞాపకాన్ని దాచుకుంటే వదిలించుకోవటానికి జీవిత కాలం పడుతుంది. అలాంటి క్షణాలు ఎన్నో, అలాంటి జ్ఞాపకాలు మరెన్నో..  మనసులో మర్చిపోలేని మధురానుభూతులు కొన్నైతే.., మరికొన్ని విషాదాన్ని తోడుగా చేసుకొని వీడ్కోలు పలకాల్సిన విచార క్షణాలు. అవన్నీ గతించిన క్షణాలు. మన జీవితమనే క్యాలెండర్ లో ఒక తిరిగిపోలేని ఒక పుటను తిప్పేయాల్సిన సమయం 'తిరిగి' రానే వచ్చింది. ఇప్పుడో కొత్త పుట......

మరో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం.., నూతనంగా, వినూత్నంగా.., ఈ సంవత్సరం కూడా ఎన్నో సంఘటనల సమాహారంగా సిద్దమై మన కోసం వేచి చూస్తుంది....గడిచిన సంవత్సరంలో ఎన్నో ఎదురుదెబ్బలను ఎదుర్కొని, మరెన్నో విజయాలనే తీపి జ్ఞాపకాలను  సైతం చవి చూసిన మనకు రాబోయే ఈ సరి క్రొత్త కాలం ఇంకొన్ని ఘటనలకు వేదిక కాబోతుంది.  కాని ఒకానొక సమయంలో ఏదోక వ్యక్తికి ఎదో గడిచిపోయింది కాలం., కాలం వెళ్తుంది కాలం తో పాటు మనమూ వెళ్తున్నామనే నిరాశ  నిస్పృహలు నిండిన వారూ లేకపోలేదు.., అలాంటి వారికి కాలమే అవరోధంగా కనబడుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోవాలేమో మనం...... మనం ఎదిగే  కొద్ది ప్రారంభంలో అన్ని అవరోధాలుగానే కనిపిస్తాయి కాని ఎదిగిన తర్వాత అవన్నీ అనుభవాలుగా ఉపయోగపడతాయి.... అవి కాలంతో అయిననూ, కాలం వాళ్ళ కలిగిన వివిధ సంఘటనల వల్ల అయిననూ.., అనుభవాలు మనిషికి అవరోధాల నుండి అవలీలగా బయట పడేసే అధిరోహిణిలుగా ఉపయోగపడి మనిషి ఆకాశమనే గమ్యానికి చేరువవుతాడు. అలాంటి గమ్యానికి ఈ సంవత్సరం చేరువ కావాలని......

జీవిత లక్ష్యం కేవలం జీవించటం కాదు ఉన్నతంగా జీవించటం, అంటే అది హోదా పరంగానో, డబ్బు పరంగానో కాదు, మన వ్యక్తిత్వ పరంగా ఉన్నతంగా జీవించటం. ఉన్నతంగా జీవించాలంటే అచంచలమైన ఆత్మ విశ్వాసం కావాలి. తనకు తన మీద విశ్వాసం లేని వాడు ఇతరులను, సమాజాన్ని విశ్వసించడు. తద్వారా ఇతరులను నమ్మడు. మనిషి ఇతరులను నమ్మిన, నమ్మకపోయినా ఈ ప్రపంచం నడిచేది కేవలం నమ్మకం పైనే. కాకపోతే "మనిషి ఉన్నతంగా ఎదగటానికి ఈ ప్రపంచం కావాలి. తాను ఉన్నతంగా ఎదిగాక ఈ ప్రపంచానికి తాను కావాలి", అలాగే జీవితంలో ఎదిగాక గెలుపూ చేరువవుతుంది. అలాగని గెలుపే జీవితం కాదు. జీవితంలో గెలుపోక భాగం... అదొక అనుభూతి.. గెలుపంటే రాజ్యాలు జయించక్కర్లేదు. కోట్లు సంపాదించక్కర్లేదు. మార్కులు, ర్యాంకులు సాధించక్కర్లేదు.., గెలుపంటే మానవత్వం, గెలుపంటే  మళ్ళి ఉన్నతమైన వ్యక్తిత్వం, గెలుపంటే ఇతరుల్లో చెడును కాదు మంచిని చూడటం... అదే గెలుపు.  ఆ గెలుపును, అలాంటి గెలుపును ఈ సంవత్సరంలో పొందాలని.....

మన జీవితంలో ఒక్కోసారి పడిపోనూ వచ్చు.. పడిపోవటం ఎప్పుడూ ఓడిపోవటం కాదు. నువ్వు పైకి లేస్తుంటే విజయం నీకు దగ్గర అవుతుంది. ఆ విజయ పథంలో గాయాలు అనివార్యం. బలహీనుడు గాయాలకు భయపడి రంగం నుండి తప్పుకుంటాడు. బలవంతుడు గాయాల నుండి పాఠాలు నేర్చుకొని ధైర్యంగా ముందుకు వెళతాడు. ఒక సగటు యువకుడు చేసేది కూడా అదే.., అర్రే యువకుడు యువకుడు అంటారు, మన దేశ ప్రధానమంత్రి యువకులే అంటారు.., వ్యాపార వేత్తలు యువకులే అంటారు. ప్రతి వ్యక్తి పాతికేళ్ళ పడుసోనివి నీకేంట్రా అంటారు.. మరి యువకున్ని చూస్తేనేమో నీరు గారి పోయి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. మరసలు ఆ యువకునిలో ఏముంది...??  ఆ యువకునికే తెలియని శక్తి ఆ యువకునిలో ఎందుకుంది..? అవును మరీ ఆ  యువకునిలో ఆకాశానికి నిచ్చెనలు వేయగల దమ్ముంది. కలలు కనే స్వేఛ్చ ఉంది. 'కిరణా'లని కెరటాలని అరచేత్తో అదిమి పట్టగల బలముంది.  ఒక యువకుడు తన యవ్వన కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటాడు.... కిందపడతాడు, లేచి ప్రయాణం సాగిస్తాడు.. మళ్ళీ పడతాడు.. నిజానికి పడ్డదే ఎక్కువ ఉంటుంది. అయితే అన్నాళ్ళ ఆ యువకుని ప్రయాణంలో అతనికి అర్డమయ్యేదేమిటంటే జీవితంలో సక్సెస్ అవడానికి మామూలు టాలెంటు ఉంటే సరిపోదనీ, ఆకాశాన్నంటే ప్రతిభ, ఆకాశాన్ని తాకినా అక్కణ్ణుంచీ ఎగరాలనే పట్టుదలా, నిరంతర సాధనా... ఇవి కావాలనీ అర్ధమవుతుంది. కొద్దిగా సమయం తీసుకుంటుంది. కొన్ని త్యాగాలూ  చేస్తాడు. కసి, పట్టుదల, ఎదగాలనే ఆకాంక్షతో లక్ష్యాన్ని సాధించాలనే  తపనతో మరుగున పడిపోతున్న ప్రతిభను, మరచిపోయిన ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ ప్రోదిచేసుకోని ఒక్కసారి ప్రపంచానికి తనేంటో చాటి చెప్తాడు... అలాంటి యువకునికి సరైన సమయం, వేదిక ఈ సంవత్సరమే కావాలని......

ఆశయాలు పర్వతంలా స్థిరంగా ఉండాలి ఆలోచనలు కాలంతో పాటు మారాలన్న వ్యాఖ్యల్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే.... ఈ సంవత్సరం మనలో కొన్ని క్రొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టాలని, ఆ ఆలోచనలు మన జీవితానికి పెను మార్పునిచ్చే అద్భుతాలుగా మారాలని అనుకుందాం. అలాగే జీవితంలో జరిగే ఎన్నో సంఘటనలకు రాబోయే కాలం నిదర్శనంగా నిలుస్తుంది. రాబోయే కాలంలో కొన్ని బంధాలకు బీటలు పడనూ వచ్చు. సరిక్రొత్త అనుభందానికి తెర తీయనూ వచ్చు. అలాంటి కొన్ని అనుభంధాలు అందమైన మన జీవితానికి ఒక అర్థాన్నిచ్చే విధంగా ఈ సంవత్సరం ఆ వెల కట్టలేని బంధాలు ముడిపడాలని....

కాలం విసిరే సవాళ్ళకు దీటైన జవాబు చెప్పగల జాతులే అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటాయి. తక్కినవన్ని సన్నగిల్లి, నీరసించి, కాల గర్భంలో కలిసిపోతాయన్నది చారిత్రకంగా నీరుపితమైన స్వప్నం. చరిత్ర చూపునకందని కాలం నుంచి ఆటుపోట్లని తట్టుకొని ప్రత్యేక వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్న భరత జాతి.... గడచిన అరవై ఏళ్ళుగా స్వరూప జ్ఞానం కొరవడి కొట్టుమిట్టాడుతుంది. వ్యక్తి దృష్టిని మాని సమిష్టి నాయకత్వం (Leader ship) కరవైన ఫలితంగా గుండెల నిండిన ఆత్మ విశ్వాసంతో దేశం పట్ల గర్వంగా ఉండాల్సిన యువకులకు, సగటు సామాన్యులకు భవిష్యత్ పై ఎదో అలజడి. ఆ అలజడి ఈ సంవత్సరంలోనే అంతమొందాలని....

మనకు ఈ క్రొత్త సంవత్సరంలో క్రొత్తగా ఏమి అవసరం లేదు.. ఎకరం భూమి లో మునుపటి కంటే రెట్టింపు పండించగల రైతు కావాలి. అలా పండించిన రైతు పండించిన పంట లోనే తన పంటకు వాడే పురుగు మందు తను వాడి చనిపోకుండా ఉండే రోజు కావాలి. నిబద్దతగా పని చేసి పారిశ్రామికోత్పత్తిని ఇంతకంతలు చేయగల కార్మికుడు కావాలి. న్యాయమైన ధరకు సరకులు సరఫరా చేసే వర్తకుడు మనకు కావాలి. అహాన్ని వీడి ప్రజాసేవ చేయగల ప్రభుత్వోద్యోగి మనకు కావాలి. ఇవ్వన్నింటిని సాకారం చేయగలిగే పారదర్శక పాలన అందించటానికి దేశాన్ని ముందుండి నడిపించే ఒక మంచి నాయకుడు కావాలి. అలాంటి నాయకుణ్ణి ఇప్పుడున్న "నేత"లో చూడాలని... ఈ సంవత్సరమే అది జరగాలని.....
వీటన్నిటికంటే ముఖ్యమైనది, ప్రధానమైనది....
ఒక సగటు ఆడపిల్ల అర్దరాత్రి రోడ్డుపై అడుగేయకపోయినా పర్వాలేదు కానీ మిట్ట మధ్యాహ్నం మానవజాతి చూస్తుండగా స్నేహితుడే మోహితుడై కిరాతకుడవుతున్నాడు., ప్రేమికుడే పామై కాటేస్తున్నాడు., బంధువే రాబందువై మీద పడి తార్చుతున్నాడు., చివరికి కని పెంచిన కన్న తండ్రే కరుణ లేని కసాయివాడై కరుస్తున్నాడు...మదం పట్టిన మగ జాతి మగువలను చెరపట్టగా నిస్సిగ్గుగా చూసే ఈ (నా)న'సమాజం' నవ సమాజంగా రూపాంతరం చెందాలి. సగటు ఆడపిల్లకి అన్యాయం జరిగితే న్యాయమా నివేక్కడ అని న్యాయాన్నే దీనంగా అర్థించని రోజు రావాలి..... అమ్మాయి ఆత్మాభిమానాన్ని అణచివేయకుండా ఉండబడే రోజు రావాలి.....  సగటు ఆడపిల్ల అవనంతాతరాలను దాటి ఆత్మ విశ్వాసమే ఆలంబనగా, అవరోధాలనే అవకాశాలుగా మలచుకొని ఆకాశమనే అంతిమ లక్ష్యాన్ని చేరుకొని అద్భుతాలు సృష్టించి అందరికి ఆదర్శప్రాయమవ్వాలి. ఈ సంవత్సరం ఆడపిల్లల ఆక్రందనలు ఆగిపోవాలని.......

ఇందులో ప్రతి ఒక అంశం నెరవేరాలని నేను మనస్పూర్తిగా అభిలషిస్తూ, ఆకాంక్షిస్తూ సరిక్రొత్త ఆలోచనలతో సరిక్రొత్త సవాళ్లతో నూతన సంవత్సరానికి స్వాగతం చెప్తూ....... ఈ సంవత్సరం.., ఒక తల్లి తన కొడుకును ఒక మంచి ప్రయోజకుడిగా చూసే సంవత్సరం.., ఒక తండ్రి తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచే సంవత్సరం.., ఒక కూతురు తన తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చే సంవత్సరం.., ఒక యువకుడు తన గమ్యం అనే తీరాన్ని చేరుకొని తను మనసు పడ్డ అమ్మాయిని మనువాడే సంవత్సరం.., ఒక సగటు సామాన్యుడు తన కలలను సాకారం చేసుకుని సగర్వంగా బ్రతికే సంవత్సరం.., ఒక ప్రజస్వామ్యనేత తన దేశాన్ని తన కళ్ళతో ఎలా అయితే చూడాలనుకుంటున్నాడో అలా రూపుదిద్దుకునే సంవత్సరం.., భారత ఆడపిల్లలు అణచివేయకుండా తన ఆత్మాభిమానాన్ని ప్రతి ఒక్కరు గౌరవించే ఆడపిల్లల సంవత్సరం.., ఒక ఓటమికి వేదికయ్యే సంవత్సరం .., అలాగే గెలుపు గుర్తుండిపోయే సంవత్సరం..... ఇలాంటి అద్భుతమైన సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాము. ఈ సంవత్సరంలో లక్ష్యాలు తీరిపోయి లక్షలు సంపాదించే సామర్థ్యం కలిగిన యువకులందరికి ఒక మల్లె తీగ లాంటి అందమైన అమ్మాయి అల్లుకోవాలని మనస్పూర్తిగా ఆశిస్తూ, ఆశపడుతూ, అపేక్షిస్తూ......... నూతన సంవత్సర శుభాకాంక్షలతో చివరగా ఈ మాటలు

రాబోయే నవశకంలో.........
సంతాపాలను స్వీకరిద్దాం
సంఘర్షణలను అనుభవిద్దాం
కష్టాలను ఆదరిద్దాం
కన్నీళ్లను గౌరవిద్దాం
మనమే విజేతలం
కాలానికి నిర్ణేతలం.

ఒక వస్తువు-చేరువ చేసే విధానం-విజయ పరంపర....


భారతదేశంలో ఎన్నో వనరులు ఉన్నాయి. ఆ వనరులకు తగినట్లుగానే నైపుణ్యం కలిగిన మానవ శక్తి ఉంది. అద్భుతమైన మేధా శక్తి మన సొంతం. కాని భారతదేశం దేనిలోను "పరిపూర్ణతను" చూపలేకపోతుంది. పరిపూర్ణత అనే పదమే అందరికి క్రొత్తగా అనిపించచ్చు. మనం ఒక పనిని చేస్తున్నప్పుడు ఆ పని చివరి వరకు అంటే మనం నిర్దేశించుకున్న గమ్యం వరకు చేరువ అవుతుందా లేదా అనేది చూసుకోవటమే "పరిపూర్ణత" ఇది కొన్ని సార్లు చూపకపోవటానికి అనేక కారణాలు ఉండచ్చు. ఒక దానిలో మనం విజయం సాధించిన మాత్రాన ప్రతి దానిలో మనం నెగ్గుకురాలేము. దానికి కొంత ఓర్పుతో జత కలిసిన సాధన అవసరమవుతుంది. సాధనతో అనుభవమూ జత కూరుతుంది. వీటికి తగిన నైపుణ్యం, ఓపిక, చేయాలనే సంకల్పం ఉన్నప్పుడు ఆ పనికి "పరిపూర్ణత" ఏర్పడుతుంది. ఇవ్వన్ని ఒక పనిని దిగ్విజయంగా పూర్తి చేయటానికి ఉపయోగపడతాయి.

మనమొక వస్తువును అభివృద్ధి చేస్తున్నాం.. ఆ వస్తువు మన సుసంపన్నమైన మేధా శక్తితో రూపొందించాము. ఎంతో అద్భుతంగా తయారయ్యింది ఆ వస్తువు. పలు దేశాలకు దీటుగా కేవలం మన సొంత నైపుణ్యం తో తయారు చేసిన ఆ వస్తువు కొందరిని నివ్వెర పరచింది. అపార మేధస్సును పోసి తయారు చేసిన ఆ వస్తువు చివరికి వచ్చేసరికి దాన్ని చేరేచోటికి చేరువ చేయలేకపోయాము. అంటే అక్కడ అంత అద్భుతమైన, పలు దేశాలనే నివ్వెర పరచిన ఆ వస్తువు దాని గమ్యాన్ని చేరలేక, మనం అనుకున్న లక్ష్యాన్ని తాకలేకపోయింది. అంటే ఇక్కడ ఆ వస్తువు చేరలేకపొవటానికి కారణం ఏమిటి?? వస్తువే కారణమా?? ఇంకా వేరే కారణాలు ఉన్నాయా?? ఒక చిన్న ఉదాహారణ ద్వారా తెలుసుకుందాం.

ఒక రైతు మామిడి మొక్క ను పెడతాడు. అది పెరిగి చెట్టు అయ్యాక చివరికి అది ఫలాలను ఇచ్చే దశకు వస్తుంది. ఆ చెట్టు మంచి మేలి రకమైన ఫలాలను ఇస్తుంది. ఒక్కో ఫలం చాలా బాగుంటుంది. ఆ చెట్టు పని ఆ చెట్టు చేసింది. ఆ చెట్టు పని ఏంటి ఫలాలను ఇవ్వటం... ఇచ్చింది. ఇప్పుడు తర్వాత పని రైతుది. ఆ రైతు ఆ చెట్టు ఇచ్చిన ఫలాలను వ్యాపారికి అమ్ముతాడు. ఆ వ్యాపారి ఆ ఫలాలు అద్భుతంగా ఉండటం చేత వాటిని కొనుగోలు చేయటానికి ఆసక్తి చూపటమే మొత్తం పండ్లను తీసుకుంటాడు. ఆ తర్వాత..... ఆ పండ్లను వ్యాపారి సంతలో అయినా, రోడ్డు పైనో రోడ్డు కిందో పెట్టి రుచి చూపించి మరీ ఆ ఫలాలను అమ్ముతాడు. చివరికి ఆ ఫలం చేరాల్సిన వాడికి చేరుతుంది.

ఇప్పుడు దీనిలో ఎవరు విజయవంతం అయ్యారు. మొక్కను పెట్టిన రైతా? ఫలాలను అమ్మిన వ్యాపారా? లేక ఆ ఫలం గొప్పతనమా. నిజం చెప్పాలి అంటే ఇందులో అందరి గొప్పతనం ఇమిడి ఉంది. ఏ ఒక్కరికో ఈ గొప్పతనాన్ని ఆపాదించటం కుదరదు. చెట్టు అద్భుతమైన, మేలిమిరకమైన పండ్లను ఇచ్చి తన గొప్పతనాన్ని చాటుకుంది. ఆ చెట్టు ఫలాలను వ్యాపారికి అమ్మటం ద్వారా ఆ రైతు తన బాధ్యతను పూర్తి చేసుకున్నాడు. ఆ రుచికరమైన పండ్లను ప్రజలకి అమ్మి తనను తాను నిరూపించుకున్నాడు వ్యాపారి. ఇందులో ప్రతి ఒక్కరి కృషి దాగి ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఆ పండ్లను కోయటానికి రైతు ఉపయోగించిన కర్ర/కత్తి కృషి కూడా దీనిలో ఉంది. దాన్ని ఉపయోగించి ఆ ఫలాలను జాగ్రత్తగా తెంపిన ఆ రైతు శ్రమ దాగి ఉంది. ఏ ఒక్కరి కృషి లేకపోయినా ఆ వస్తువు(ఫలం) చివరి వరకు చేరేది కాదు. ఇందులో ఎవరు చేసే పని వారు సంక్రమంగా చేసిన పిమ్మటే ఆ వస్తువు చేరువయ్యింది. అంతే కాని అందులో చెట్టు పోయి వ్యాపారికి పండ్లు అమ్మలేదు. వ్యాపారి పోయి చెట్టు పండ్లను తీసుకురాలేదు. చెట్టే ఫలాలను అమ్మమనటం కూడా అవివేకమే, అసంభంధం కూడా.

కనుక ఒక వస్తువు చేరువ కావాలంటే దాన్ని తయారు చేసేవాడు ఎంత ముఖ్యమో దాన్ని ప్రజలకు లేదా చేరాల్సిన వాళ్ళకు చేరువ చేయటం కూడా అంతే ముఖ్యం. ఇందులో ఏ ఒక్కరు సరిగా కాని, నిర్లక్షంగా కాని చేసిన ఆ వస్తువు లేదా పండు అక్కడే ఉండిపోయి మరుగున పడిపోతుంది.  కారులో నాలుగు చక్రాలు సరిగా ఉన్నప్పుడే కారు కదులుతుంది. ఏ ఒక్క చక్రం పని చేయకపోయినా ఆ కారు ఎంత నడంగ ఉంది ఎం ప్రయోజనం. అది ఎంత అద్భుతంగా ఉన్నా సరే. ప్రపంచ దేశాలను నివ్వెర పరచే అబ్బురమైన వస్తువైనా దాన్ని చేరువ చేయాల్సిన వాళ్ళకు చేయకపోతే ఆ ఉత్పాదనే వ్యర్థం. ఎంత అద్భుతమైన కానీ ఆ అద్భుతాన్ని చేరువ చేసే నైపుణ్యం, మానవ వనరు, మేధా సంపత్తి కావలి అప్పుడే ఆ వస్తువు లక్ష్యం నెరవేరినట్లు అవుతుంది. అప్పుడే ఆ వస్తువుకి "పరిపూర్ణత" చేకూరుతుంది.

2014 రౌండప్: 2014 సంవత్సర విశేషాలతో సమగ్ర సమాహారం..




ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది రాజకీయ నేతల జాతకాలను 2014 సంవత్సరం మార్చేసింది. ఊహించని అనేక పరిణమాలు జరిగాయి.  రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగా అనేక రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మన దేశంలో, రాష్ట్రంలో కీలక మార్పులు జరిగాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో 2014 సంవత్సరం చిరస్థాయిగా మిగిలిపోతుంది. రాష్ట్రం రెండుగా విడిపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. రెండు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. సార్వత్రిక ఎన్నికలతోపాటు  రాజ్యసభ, స్థానిక సంస్థలు, రెండు రాష్ట్రాల శాసనసభలకు దాదాపుగా అన్ని ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరిగాయి.  తొలుత మునిసిపల్ ఎన్నికలు, ఆ తరువాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో జత కట్టడంతోపాటు సినిమా హీరో పవన్ కల్యాణ్ మద్దతుతో పోటీ చేసింది.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒంటరిగానే పోరులో నిలిచింది. ఈ ఏడాది మూడు కొత్త రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి. ఎంఆర్ పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ సారధ్యంలో మహాజన్ సోషలిస్ట్ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జైసమైక్యాంధ్ర, సినిమా హీరో పవన్ కల్యాణ్ నాయకత్వాన జనసేన పార్టీలు పుట్టుకొచ్చాయి. జనసేన ఎన్నికలలో పోటీ చేయలేదు. మిగిలిన పార్టీలు పోటీ చేసినా ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయాయి. ఇక రాజకీయ వలసలు కూడా ఈ ఏడాది విపరీతంగా జరిగాయి.

జనవరిలో బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా మూడవసారి బాధ్యతలు స్వీకరించారు. నేపాల్ కాంగ్రెస్ అధినేత సుశీల్ కోయిరాల ప్రధానిగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరిలో థాయ్ లాండ్ లో హింసాకాండ చెలరేగింది. ఆపద్ధర్మ ప్రధాని ఇంగ్లక్ షినవత్రా దేశ రాజధాని బ్యాంక్ కాక్ వదలి వెళ్లారు. అక్కడకు 150 కిలో మీటర్ల దూరంలో ఉండి పాలన కొనసాగించారు.  ఇంగ్లక్ షినవత్రాను, ఆమె కేబినెట్‌లోని 9 మంది మంత్రులను రాజ్యాంగ కోర్టు మేలో పదవుల నుంచి తొలగించింది. ఎన్నో సైనిక కుట్రలు చవిచూసిన థాయ్‌లాండ్‌లో మళ్లీ సైన్యం తిరుగుబాటు చేసింది. థాయ్‌లాండ్‌ను ఆ దేశ సైన్యం అధీనంలోకి తీసుకుంది. ఆ తరువాత ఇంగ్లక్ షినవత్రాను సైనిక ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. ఉక్రెయిన్ లో భాగంగా ఉన్న క్రిమియా మార్చిలో స్వతంత్ర దేశంగా అవతరించింది. ఈ దేశంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో 98.8 శాతం మంది రష్యాలో కలవాలవడానికి ఇష్టపడ్డారు. ఏప్రిల్ లో ఆఫ్ఘనిస్తాన్ లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. తాలిబన్ల హెచ్చరికలను జనం లెక్కచేయలేదు. భారీస్థాయిలో పోలింగ్ జరిగింది. 

రాజకీయ ప్రముఖుల మృతి


మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన రెడ్డి(80) మే 9న కన్నుమూశారు. బీజేపీ ముఖ్య నేతలు ఇద్దరు మృతి చెందారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు, బంగారు లక్ష్మణ్(74) ఫిబ్రవరి 26న, ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలె నరేంద్ర మార్చి 9న కన్నుమూశారు. వైఎస్ఆర్ సీపీ నాయకురాలు శోభానాగిరెడ్డి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం గూబగుండం మిట్ట వద్ద ఏప్రిల్ 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, 24న కన్నుమూశారు. కృష్ణా జిల్లా నందిగామ టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ రావు జూన్ 15న గుండెపోటుతో మృతి చెందారు. మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే మన్నేరు వెంకటరమణ (67) డిసెంబరు 15న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వైఎస్ఆర్ సీపీ నేత, ప్రభుత్వ మాజీ సలహాదారు, ప్రముఖ సినీ నిర్మాత, విసు సంస్థల అధినేత సీసీ రెడ్డి(చవ్వా చంద్రశేఖర రెడ్డి) అక్టోబరు 6న మృతి చెందారు.


ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు-2014కు కేంద్ర మంత్రి మండలి ఫిబ్రవరి 7న ఆమోదం తెలిపింది. ఆ నెల 13న లోక్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లోక్ సభలో రణరంగమే జరిగింది. లగడపాటి రాజగోపాల్ సభలో పెప్పర్ స్పే చల్లారు. సభ్యులు పరుగులు తీశారు.  18న లోక్ సభలో ఈ బిల్లును ఆమోదించారు. కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ఏకమవడంతో సునాయాసంగా ఆమోదం లభించింది. 20న రాజ్యసభలో ఆమోదించారు. ఆ తరువాత రాష్ట్రపతి  ఆమోద ముద్ర పడటంతో 29వ రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించారు. రెండు రాష్ట్రా విభజన - జూన్ 2 అపాయింటెడ్ డే - ఎన్నికల తరువాత ప్రభుత్వాలు ఏర్పాటవుతాయని ప్రకటన వెలువడింది. జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవ దినోత్సవాన్ని మరో స్వాతంత్ర్య దినోత్సవంలాగా  జరుపుకున్నారు. 10 జిల్లాల తెలంగాణకు అదే రోజు కె.చంద్రశేఖర రావు తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా, 9 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. హామీ ఇచ్చిన ప్రకారం రైతుల రుణాలు మాఫీ చేశారు. బంగారు తెలంగాణ నిర్మిస్తానని కేసీఆర్ హామీలు ఇస్తూ పాలన కొనసాగిస్తున్నారు.

గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జునా యూనివర్సిటీ వద్ద జూన్ 8న 12 జిల్లాలతో విడిపోయిన ఏపీకి   చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతోపాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా, 17 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల సమయంలో గెలుపే ధ్యేయంగా అమలు చేయడానికి  సాధ్యంకాకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చలేక  చంద్రబాబు సతమతమవుతున్నారు.   ప్రధానంగా రుణ మాఫీ విషయంలో ఎన్నో నిబంధనలు విధించడంతో సగానికి సగం మంది అర్హులుకాలేదు.   ఇంటికో ఉద్యోగం అని చెప్పారు. ఉన్న ఉద్యోగాలనే ఊడబీకుతున్నారు. రాజధాని ఏర్పాటుకు భూముల సేకరణ అంశం కూడా తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాబుపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోంది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన కొద్ది కాలంలోనే మంచి ఫలితాలను సాధించింది. ఈ పార్టీయే ఏపీలో అధికారంలోకి వస్తుందని చాలామంది భావించారు. అయితే ఏపీలో కేవలం 2 శాతం ఓట్ల తేడాతో అధికారం చేజారిపోయింది. ఎన్నికల సంఘం మే 26న దీనిని రాజకీయ పార్టీగా గుర్తించింది.  ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ అయ్యారు. అక్టోబరు 24న వైఎస్ఆర్ సీపి తరపున ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా భూమా అఖిల ప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఏపీలోని 175 శాసనసభ స్థానాలకు మే 7న జరిగిన ఎన్నికలలో  టీడీపీ 102 స్థానాలు, దాని మిత్రపక్షం బీజేపీ నాలుగు స్థానాలు కైవసం చేసుకున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను కొనసాగించేందుకు   ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 67 స్థానాలను గెలుచుకొని  ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. లోక్ సభ స్థానాలను టీడీపి 15, వైఎస్ఆర్ సీపీ 8, బీజేపీ రెండు స్థానాలు గెలుచుకున్నాయి.  కాంగ్రెస్ కు చావు దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం గల అనేక మంది ప్రముఖులు ఘోరంగా ఓడిపోయారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, అప్పటి మంత్రులు కన్నా లక్ష్మీ నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, శైలజానాథ్, కొండ్రు మురళీ మోహన్, స్పీకర్ నాదెండ్ల మనోహర్ తదితరులు అందరూ ఘోర పరాజయాన్ని చవిచూశారు. సీపీఐ, సీపిఎం నుంచి ఒక్కరు కూడా గెలవలేదు. టీడీపికి, వైఎస్ఆర్ సీపీకి మధ్య రెండు శాతం ఓట్లు మాత్రమే తేడా ఉంది. వైఎస్ఆర్ సీపీకంటే టీడీపికి 5.6 లక్షల ఓట్లు మాత్రమే అదనంగా వచ్చాయి.

తెలంగాణలోని 119 శాసనసభ స్థానాలకు ఏప్రిల్ 30న జరిగిన ఎన్నికలలో  టీఆర్ఎస్ 63, కాంగ్రెస్ 21, టీడీపి 15, బీజేపీ 5, ఎంఐఎం 7, వైఎస్ఆర్ సీపి 3, బీఎస్ పీ 2, సీపీఐ, సీపీఎం ఒక్కో స్థానంలో గెలిచాయి. 17 లోక్ సభ స్థానాలలో టీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 2, టీడీపి, బీజేపీ, ఎంఐఎం, వైఎస్ఆర్ సీపీ ఒక్కొక్క స్థానాన్ని గెలుచుకున్నాయి.

మోదీ ప్రభంజనం!
కేంద్ర రాజకీయాలలో ఈ ఏడాది కీలక మార్పులు జరిగాయి. వరుసగా మూడు దఫాలు గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీని 2014 ప్రధానినిని చేసింది.  రాజకీయ నేతల గతినేకాదు, దేశ గతిని, రాష్ట్రాల గతిని మార్చేసింది. కొత్తగా 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. కాంగ్రెస్ కు చావు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి లోక్‌సభలో ప్రస్తుతం 44 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కలేదు. దేశమంతా మోదీ ప్రభంజనం. ఊహించని విధంగా బీజేపీ ఒక్కటే లోక్ సభలో పూర్తి మెజార్టీ స్థానాలు సాధించింది. సార్వత్రిక ఎన్నికల తరువాత వివిధ రాష్ట్రాలలో కూడా మోదీ ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపించింది.  మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ లలో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. మరి కొన్ని రాష్ట్రాలలో కూడా ఆ పార్టీ పరిస్థితి మెరుగుపడింది. వివిధ దేశాలలో పర్యటించి  మోదీ తన ప్రసంగాల ద్వారా అంతర్జాతీయంగా కూడా మంచి పేరు, గుర్తింపు సంపాధించారు. అయితే నల్లధనాన్ని  బయట తీసుకువచ్చే విషయంలో కేంద్రం ఆశించిన ఫలితాలను సాధించలేకోయింది.

ఏప్రిల్ 7 నుంచి మే 12 వరకు దేశవ్యాప్తంగా 9 విడతలుగా సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. మోదీ సునామీతో ఒక్క బీజేపీయే 285 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 44 స్థానాలకు దిగజారిపోయింది. అన్నాడిఎంకె 37, తృణమూల్ కాంగ్రెస్ 34 స్థానాలను గెలుచుకున్నాయి. మే 26న నరేంద్ర మోదీ 15వ ప్రధానిగా ప్రమాణం చేశారు. సార్వత్రిక ఎన్నికలతోపాటు ఏపి,  తెలంగాణ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఏపీలో కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. దాదాపు 15 కోట్ల మంది యువతీ యువకులు కొత్తగా ఓటర్లుగా నమోదు కావడంతో దేశంలోని మొత్తం ఓటర్లలో 47 శాతం మంది 18-35 ఏళ్ల లోపు యువ ఓటర్లే ఉన్నారు.

సామాన్యుల ఆశాదీపంగా  ప్రారంభమైన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 2013లో ఢిల్లీలో అనూహ్య విజయం సాధించింది. ఈ ఏడాది జనవరి 2న ఢిల్లీ శాసనసభలో అరవింద్  కేజ్రీవాల్ ప్రభుత్వం విశ్వాసపరీక్ష నెగ్గింది. అదే నెల 14న శాసనసభలో జన్ లోక్ పాల్ బిల్లు తీరస్కరణకు గురికావడంతో కేజ్రీవాల్ రాజీనామా చేశారు. సామాన్యుల ఆశలన్నీ ఒమ్ముచేస్తూ ఆప్ పాలన 49 రోజుల్లో ముగిసింది. నవంబర్ లో శాసనసభను కూడా రద్దు చేశారు.
జనవరి 31న రాజ్యసభకు 37 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 7న జరిగిన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలలో మొట్టమొదటి సారి నోటా ఆప్షన్ ప్రవేశపెట్టారు.   నవంబర్ లో కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తమిళనాట కొత్త పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు.  తన తండ్రి స్థాపించి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తమిళ మానిల కాంగ్రెస్ పేరునే ఆయన పార్టీ పేరుగా ప్రకటించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధినేత్రి జె.జయలలితను ఆదాయానికి మించి ఆస్తుల కేసులో దోషిగా బెంగళూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టు సెప్టెంబరు 28న నిర్ధారించింది. ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ. 100 కోట్ల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఆమెను బెంగళూరు నగర శివారులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు.ఆ తరువాత ఆమె బెయిలుపై బయటకు వచ్చారు. ఆమె శాసనసభ్యత్వం కోల్పోయారు.

జూన్ లో ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి గోపినాథ్ ముండే దుర్మరణం చెందారు. నవంబరులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవర (77) కన్నుమూశారు. డిసెంబరులో కాంగ్రెస్ వృద్ధ నేత, మహారాష్ట్ర తొలి ముస్లీం ముఖ్యమంత్రి ఏఆర్ అంతులే(85), ప్రఖ్యాత న్యాయశాస్త్ర కోవిదుడు, కమ్యూనిస్టు యోధుడు, 1987 రాష్ట్రపతి ఎన్నికల్లో ఆర్.వెంకట్రామన్ పై పోటీ చేసిన  వి.ఆర్. కృష్ణయ్యర్(100) కన్నుమూశారు.
కలిసి ఉందాం!

ఈ ఏడాది అంతర్జాతీయంగా జరిగిన రాజకీయ పరిణామాలలో స్కాట్లాండ్, క్రిమియాలలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపాయి.  రెండు చోట్ల కలసి ఉందామనే అభిప్రాయమే వ్యక్తమైంది. క్రిమియా స్వతంత్ర దేశంగా అవతరించింది.  నేపాల్ లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది.

సెప్టెంబరులో జరిగిన స్కాట్లాండ్ ప్రజాభిప్రాయ సేకరణలో సమైక్యవాదానికే మద్దతు లభించింది. యునైటెడ్ కింగ్‌డమ్‌ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడే అంశంపై జరిగిన రిఫరెండంలో సమైక్యవాదానికే స్కాట్లాండ్ ప్రజలు ఓటు వేశారు.  సమైక్యవాదానికి అనుకూలంగా 55 శాతం మంది ఓట్లు  వేస్తే, వ్యతిరేకంగా 45 శాతం మంది ఓటు వేశారు. దీంతో, 300 ఏళ్ల బ్రిటన్-స్కాట్లాండ్ అనుబంధం యథావిధిగా కొనసాగుతోంది.
దశాబ్దన్నర క్రితం లాటిన్ అమెరికా ఖండాన్ని ఊపేసిన 'గులాబీ విప్లవం' ప్రభావం ఇంకా తగ్గలేదని అక్టోబరులో జరిగిన బ్రెజిల్ ఎన్నికలు మరోసారి చాటిచెప్పాయి. దక్షిణ అమెరికా ఖండంలోని అతి పెద్ద దేశమైన బ్రెజిల్‌ అధ్యక్ష పదవికి నువ్వా నేనా అన్నట్లు అక్టోబరు 25న జరిగిన ఎన్నికల్లో వర్కర్స్ పార్టీ(పీటీ)కి ప్రాతినిథ్యం వహిస్తున్న దేశాధ్యక్షురాలు, ఒకనాటి కమ్యూనిస్టు గెరిల్లా దిల్మా రోసెఫ్ స్వల్ప మెజారిటీతోనే అయినా విజయాన్ని సొంతం చేసుకోగలిగారు. 

అమెరికా పార్లమెంటు ఉభయసభలకు నవంబర్ లో జరిగిన మధ్యంతర ఎన్నికల ఫలితాలు అధ్యక్షుడు బరాక్ ఒబామాను, అధికార డెమొక్రాటిక్ పార్టీని కోలుకోలేని దెబ్బ తీశాయి. ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, సెనెట్‌లోని 36 స్థానాలకు(మొత్తం 100 సీట్లు), మొత్తం 50 రాష్ట్రాలకు 36 రాష్ట్రాల్లో గవర్నర్ పోస్టులకు ఎన్నికలు జరిగాయి.  ప్రతినిధుల సభ, సెనెట్.. రెండింటిలోనూ రిపబ్లికన్లు ఆధిపత్యం సాధించారు. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు 235 సీట్లు దక్కించుకోగా, డెమోక్రాట్లు 157 స్థానాలకే పరిమితమయ్యారు. ఎన్నికలకు ముందు ప్రతినిధుల సభలో రిపబ్లికన్లకు 199, డెమోక్రాట్లకు 233 స్థానాలు ఉన్నాయి. సెనెట్‌లో రిపబ్లికన్లు 52 సీట్లలో, డెమోక్రాట్లు 43 స్థానాల్లో గెలుపొందారు.

డిసెంబర్ లో ఆఖరున అత్యంత విషాదకరమైన సంఘటన అందరిని కలచివేసింది. మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా విమానం డిసెంబర్ 28 న 162 మంది ప్రయాణికులతో ఇండోనేషియా వెళ్తూ ఒక్కసారిగా అదృశ్యమైంది. ఆ అదృశ్యమైన విమానం జావా సముద్రం లో కూలిపోవటం అంతులేని ఆవేదనను మిగిల్చింది. 162 మంది ప్రయాణికులు జలసమాధి కావటం నిజంగా దురదృష్టకరం. ప్రపంచమంతా ఈ సంఘటనతో తీవ్ర బాధకు గురైంది. ఏది ఏమైనా ఈ స్మవ్స్తారం కొన్ని సంతోషాలను మిగిల్చితే కొన్ని విషాదాలకు కూడా వేదికయ్యింది.

హరికాంత్

Monday, 19 January 2015

ప్రత్యేక కథనం: మన గురించి ఆలోచిద్దాం... మన కోసం అమలుచేద్దాం!!

భారత దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పేదరికం, నాణ్యత లేని విద్య, అవినీతి. భారత జనాభాలో మూడింట రెండొంతుల మంది ఇంకా దారిద్ర్య రేఖకు దిగువనే బ్రతుకీడుస్తున్నారు. 50 శాతం మందికి తాగే రక్షిత మంచినీరు అందుబాటులో లేదు. చాలా మందికి నాణ్యత గల విద్య అందటం లేదు. అమర్త్య సేన్ అన్నట్లు రెండు భిన్నమైన భారత దేశాలున్నాయి. భారత దేశం పేద ధనవంతమైన దేశం. మొదటి దేశం కాలిఫోర్నియా తరహా లో దూసుకెల్తుండగా, రెండవ దేశం ఆఫ్రికా తరహా లో మగ్గిపోతుంది. దీనిలో ఎంతైనా వాస్తవం ఉంది.

మొదట భారత దేశంలో ధనిక మరియు పేద వర్గాల మధ్య అంతరాలను తగ్గించాలి. భారత దేశ జనాభాలో సుమారు 40 కోట్ల మంది కడు బీదలు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఇది అధికారిక లెక్కల ప్రకారం మాత్రమే. అనధికారిక గణాంకాల ప్రకారం ఇంతకంటే రెట్టింపు ఉన్నా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంక అవినీతి.., అన్ని రకాల అవినీతికి తల్లి వేరు రాజకీయ అవినీతి. పారదర్శకత, జవాబుదారి తనం పటిష్టంగా వ్యవస్థీకరమైన చోట.., అవినీతి అనేది ఉత్తమాట. గణతంత్ర రాజ్యంగా మన భారత్ అవతరించి అరవై ఏళ్ళు దాటినా అంతటి కట్టుదిట్టమైన యంత్రాంగాన్ని నెలకొల్పుకోలేక పోయినట్లే. ఏ పార్టీ పాలన అన్న దాంతో నిమిత్తం లేకుండా అవినీతి పరులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పుడున్న భారత దేశం ప్రపంచదేశాలకు దీటుగా సరిక్రొత్త సవాళ్ళను పరిష్కరించే దేశంగా నిలదొక్కుకోవాలంటే ముందుగా మనం అవినీతి వేర్లను పెకిలించి వేయాలి. చాలా దేశాల్లో పటిష్టమైన యంత్రాంగాలు ప్రస్పుటమవుతున్న పాలకుల్లోని జడత్వమే జాతికి ప్రమాదహేతువవుతుంది. ప్రమాణం చేసి అబద్ద సాక్ష్యం చెప్పిన అమెరికా అధ్యక్షున్నే బోనేక్కించిన చరిత్ర అమెరికాకు ఉంది. నీతి తప్పిన నేతల ఏలుబడిలో విచ్చల విడిగా పెరిగిన అవినీతి, దేశ ప్రగతిని కరిమింగిన వెలగ పండును చేస్తుంది. అవినీతి ఆట కట్టించాలంటే, బహుముఖ స్థానాల్లో పోరు సాగించాల్సి ఉంటుంది. కానీ అది ఏ విధంగా అన్నది మన ముందున్న అతి పెద్ద సవాలు ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసి రాజకీయ పెద్దల దయ దాక్షిణ్యాలకు అతీతంగా దాన్ని తీర్చిదిద్ది ఏ స్థాయి వారినైనా విచారించగలిగే చట్టబద్ద అధికారాలు కల్పించి దాన్ని పార్లమెంట్ కు తద్వారా ప్రజలకు జవాబుదారితనం చెయ్యటం ద్వారా సరైన పద్దతిలో ఆలోచించాలి. నీతులు చెప్పటమే కాకుండా ప్రజలు సైతం అవినీతి అంతంపై నడుము బిగించాలి.

సువిశాలమైన భారత దేశం ఎన్నో సంక్లిష్టతలమయం. విభిన్న పరిస్థితులు, స్థితిగతులు, పరిణామాలు, ప్రమాణాలు అనివార్యం. మంచిని ఎంచుకొని ముందుకు సాగితేనే ప్రయోజనం. ఉజ్వల భారత్ భవిత నిర్మాణానికి గత అనుభవాలే పునాది రాళ్లు. భారతదేశ అభివృద్ధిలో యువత ప్రధాన పాత్ర తప్పకుండ పోషించగలదు. దీనిలో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇప్పుడు మన దేశ ప్రధాన మంత్రి "యువకుల" మంత్రం జపిస్తున్నాడన్నా అదే కారణం. అక్షరాస్యత, పర్యావరణం, సామజిక న్యాయం, గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య తారతమ్యాన్ని తగ్గించటం ఇలాంటి అంశాలపై యువత దృష్టి పెడితే త్వరలోనే మన ఇండియా కలాం కలలు కన్నా ఇండియాగా రూపాంతరం చెందుతుంది.

కెరియర్ లక్ష్యం కోసం పని చేసే యువత కుటుంబం, దేశం, సమాజం, సాటి మనిషి కోసం పరితపించి పనిచేయగలదన్నది ప్రజల దృడ నమ్మకం. దేశానికి, సమాజానికి మంచి అందించటానికి యువత సృజనాత్మకమైన పరిష్కారాలతో ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యువత గుండెల్లో ప్రజ్వరిల్లే మంట ఈ ధరిత్రిలోనే అత్యంత అతి శక్తిమంతమైన వనరు. అలా జ్వలించిన యువత యోచన, ఆలోచన సక్రమంగా సరి అయిన దిశలో సాగితే దేశ ముఖ చిత్రమే అద్భుత రూపాంతరం చెందుతుంది. అందుకే ప్రగతి సాధనకు యువతరం నిష్పాక్షిక దృక్పథం తో ముందడుగు వేయాలి.

యువత అంచనా వేయటానికి కాదు, అన్వేషణ కోసం కాదు, అమలు చేసేందుకు కాదు, స్థిరమైన పనులకు కాదు, వినూత్న కార్యాలకు... అవును యువత వినూత్న కార్యాలకు......

హరికాంత్

ప్రత్యేకం: మెరుపు తీగతో మెరుపు లాంటి ట్రాఫిక్ ప్రేమ కథ

మనకు జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు అనుకోకుండా జరిగిపోతుంటాయి... కొన్ని కొన్ని మనం కల్పించుకొని మరీ చేస్తుంటాం. అందులో కొన్ని ముగిసిపోతుంటాయి.. అలాంటివి మనం జీవిత కాలనుగమనంలో మరచిపోతుంటాం కూడా... అయితే కొన్ని ప్రత్యేకమైనవి మనల్ని జీవితాంతం వెంటాడుతుంటాయి.. కొన్ని అందులో మధురానుభూతులుగా మిగిలిపోతే మరికొన్నిటికి విషాదాన్ని తోడుగా చేసుకొని వీడ్కోలు పలకాల్సి ఉంటుంది... అలాగే రోజులో ఎంతోమందిని కలుస్తుంటాం... పొద్దున్న నిద్ర లేచిన దగ్గరునుండి రాత్రి పడుకోబోయే వరకి రోజువారీ క్రమంలో ఎంతో మందిని చూస్తాం... అందులో కొన్ని పరిచయాలు తాత్కాలికంగా ముగుస్తాయి.. మరికొన్ని కాకతాళియకంగా మనతో శాశ్వతంగా ఉండిపోతాయి... అసలు విషయానికి వద్దాం.....

మనం జీవితంలో చాలా ప్రయాణాలు చేస్తుంటాం... కొన్ని ప్రయాణాలు మన జీవితాన్ని కొన్ని అనుకోని మలుపులు తిప్పుతాయి. ఆ మలుపులు కూడా ఒక్కోసారి మర్చిపోలేని మధురానుభుతులుగా మారతాయి. ఇప్పుడో చిన్న సంఘటన గురించి మాట్లాడుకుందాం....
ఒక యువకుడు చిన్న ప్రయాణం చేస్తుండగా.... ఆ ప్రయాణం కొంత ఆసక్తికరంగా, ఆ యువకుడికి అభికాంక్షకు తగినట్లుగా తన పయనం కొనసాగితే......

సంఘటన జరిగిన మొదటి రోజు.....
స్థలం: హైదరాబాద్ శివారు ప్రాంతం....
సమయం: శీతాకాల సాయంత్రం సరిగ్గా 7 గంటలు కావస్తుంది..... అందరు తమ తమ పనుల నుండి ఇంటి గూటికి ఎప్పుడు చేరుకుంటామా అని హడావుడి పడుతూ ఆలోచనల్లోని ఆకాంక్షలు వెచ్చగా, పరిసరాలు చల్లగా ఉన్న సమయం..

ప్రస్థానం మొదలయ్యింది..... ఒక యువకుడు తన బైక్ మీద ఆఫీస్ లో పని ముగించుకొని ఇంటికి వెళ్తున్నాడు..... అప్పటికే ఆలస్యం అవటంతో కొంచెం వేగంగానే వెళ్తున్నాడు..., రోజులాగే అతని గమనం నిరంతర ఆలోచనలతో నిరాటంకంగా సాగుతుంది.., అంతలో తన బైక్ పక్క నుండే ఒక అమ్మాయి తన స్కూటీ మీద మెరుపు తీగలా వెళ్ళటం గమనించాడు. ఆ యువకునికి వేగం అంటే ఇష్టమయి ఉండటం చేత సహజంగానే ఆ అమ్మాయి అతని దృష్టి లో పడింది... కాని ఆ అమ్మాయి ఇంకాస్త వేగం పెంచటంతో ఇతనికి ఆశ్చర్యం ఆవేశం రెండూ కలిగి తన బైక్ వేగాన్ని కూడా పెంచాడు. అతనికి ఆశ్చర్యం కలిగేదేంటంటే ఆ అమ్మాయి అంత ట్రాఫిక్ లోనూ చాల చాకచక్యంగా తన బైక్ ను నడుపుతుంది. ఇద్దరు వేగంగా వెళ్తూ ఒకరి దృష్టిలో ఒకరు పడ్డారు. ఆ వెంటనే సిగ్నల్ పడటంతో ఆ అమ్మాయి ఆగింది.. ఆ అబ్బాయి గమనిస్తూ గమనిస్తూ.., ఆ అమ్మాయి పక్కనే తన బైక్ ని తీసుకెళ్ళి ఆపాడు. అప్పుడు కలిసాయి చూపులు.... ఆ అమ్మాయి చాలా దూరం నుండి ఆ అబ్బాయిని గమనిస్తూ వస్తుంది. కాని గమనించి గమనించనట్లుగా చూసింది. అమ్మాయి కూడా అప్పుడప్పుడు చూస్తుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అసలు అమ్మాయి చూస్తుందంటే ఆమెకి.., ఆమె మనసుకి తప్ప రెండో వాడికి తెలియనే తెలియదు.. అంతే కదా అమ్మాయి చూపును ఆదివిష్ణువు కూడా కనిపెట్టలేడు. కాని ఆ అమ్మాయి చూసే చూపు ఉంటుంది చూడు ఆ చూపుని ఎన్ని బాషలలో వర్ణించిన కానీ ఇంకా తక్కువే అన్న అనుభూతి కలుగుతుంది... చూసుకుంటున్నారు చూసుకుంటున్నారు...., చూసుకుంటూనే ఉన్నారు.

ఇంతలో గ్రీన్ సిగ్నల్ కూడా పడింది. మల్లి రెండు బైక్ లు వేగాన్ని అందుకున్నాయి... ఆ అమ్మాయి చాలా వేగంగా వెళ్తుంది. ఆ యువకుడు తన మనసు వేగంతో పాటు బైక్ వేగాన్ని పెంచుతున్నాడు. ఆ అమ్మాయి బైక్ కు ఉన్న అద్దంలో ఆ అమ్మాయి చంద్రబింబం లాంటి చక్కనైన ముఖాన్ని చూసాడా అబ్బాయి. ఇంకేముంది ఆ అబ్బాయికి ఏదో ప్రత్యేకమైన అనుభూతి కలిగింది. ఎప్పుడూ లేని ఒక ఉత్తేజితానుభుతి కలిగింది. అమ్మాయిని చూసిన ఆ అబ్బాయి ఆనందం ఆకాశము హద్దులు తాకుతున్నట్లుగా అనిపిస్తుంది... ఆ అబ్బాయికి.., ఆ అమ్మాయి కన్నులు స్వయంగా దేవుడే తన హస్తాన్ని ఉలిగా చేసుకొని చేక్కినట్లుగా ఉన్నాయి.. ఆ అమ్మాయి చూపు చంద్రున్నయిన ఒక్క క్షణం భూమి చుట్టూ తిరగటం మర్చిపోయేలా చేస్తుందేమో అన్న అనుభూతిని ఆ అబ్బాయికి కలిగిస్తుంది. ఇంక అబ్బాయి తను చేరుకునే గమ్యాన్ని మరిచాడు. కాని అదృష్టం కొద్ది ఆ అమ్మాయి వెళ్తున్న వైపే ఇతని గమ్యస్థానం ఉండటం గమనార్హం. ఇంతలో మరో సిగ్నల్ రానే వచ్చింది.. తుమ్మెద ఎక్కడుంటుంది అంటే పువ్వు పక్కనే అన్నట్లుగా... మల్లి తన బైక్ ను ఆ అమ్మాయి బైక్ పక్కనే ఆపాడు, ఈ సారి ఇంకాస్త దగ్గరగా.., మల్లి చూపులు కలిసాయి.... ఆ అమ్మాయి చూపులు ఆ అబ్బాయి మనసును అగాథం లో పడేస్తున్నాయి.. కాని ఆ చూపు ఉంది చూడు... అసలు అమ్మాయి చూపుల గురించి పుస్తకం రాయాలి అంటే ఈ ప్రపంచం సరిపోదేమో... . ఆ చూపుల వల్ల అబ్బాయిలకు మనసులో ఏదో మాయ ప్రారంభమవుతుంది, శరీరం షాక్ కొట్టినట్లు అవుతుంది.... ఆ సమయంలో మన శరీరంలో సరిగ్గా పని చేసే పార్ట్ ఏదైనా ఉంది అంటే అవి కన్నులే..., ఇంతలో ఆ అమ్మాయి తన గమ్య స్థానానికి చేరువ అవుతున్నట్లు ఆ అబ్బాయికి అనిపించింది.

అయ్యో ఎలా ఆ అమ్మాయిని మళ్ళి ఎలా కలవాలి... ప్రయాణం అయిపోయేంతలోపు కొనసాగిన చూపులన్నీ ప్రయాణం అయిపోగానే ఆ అబ్బాయి మనసు మదన పడుతుంది.. యద లోపల యుద్ధం ప్రారంభమయ్యింది...  ఈ సమయంలోనే గడచిపోయిన ప్రయాణ క్షణాలు మరొక్కసారి తిరిగొస్తే బాగుండు అనిపించింది ఆ అబ్బాయికి .., ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ దొరికితే బాగుండనిపిస్తుంది... కాని ఎలా ఆ అబ్బాయి మనసు లో ఒకే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. "ఎలా?" అనే ఒకే ప్రశ్న తన మనసులో తనే ప్రశ్నించుకుంటున్నాడు. "ఎలా?" అనే ప్రశ్ననే ప్రశ్నిస్తున్నాడు "ఎలా?" అని......  ఇద్దరు మెల్లిగా వెళ్తున్నారు. ఆ అమ్మాయి బైక్ ఏదో వైపుకు తిరిగిన తానూ తిరుగుతున్నాడు. తన చూపులే ఆ అబ్బాయి మనసును తాకుతున్నాయి... ఇద్దరి ప్రయాణాలు కొనసాగుతున్న క్రమంలో..... ఆ అమ్మాయి బైక్ వేగాన్ని పెంచటం చేత, అదే సమయంలో ఆ ట్రాఫిక్ లో కొంచెం నేర్పు తో తన బైక్ ను ఆ అమ్మాయి నడపటం చేత ఆ అమ్మాయి ని ఆ యువకుడు అందుకోలేకపోయాడు. ఇంక రోడ్డు కనిపించినంత దూరం ఆ యువకుడి కళ్ళు ఆ అమ్మాయి కోసం వెతకటం ఆరంభించాయి. కాని అతని ప్రయత్నానికి ప్రయోజనమే లేకుండా పోయింది. అతని అభిలాష ఆరంభంలోనే అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇంక చేసేది లేక నిదుర పట్టనీయని జ్ఞాపకంతో, నిరుత్సాహంతో తన మనసును తనే నిందించుకుంటూ ఆ యువకుడు వెనుదిరిగాడు. ఇంక అక్కడితో ఆ సంఘటన పరిసమాప్తంగానే పరిగణించాడు.

సంఘటన తాలుకు కొనసాగింపు రోజు (రెండవ రోజు):
స్థలం: హైదరాబాద్ శివారు ప్రాంతం
సమయం: అటు ఇటుగా సాయంత్రం 7 గంటలు

ప్రస్థానం మొదలయిన రెండవ రోజు...... ఆ యువకుడు అదే సమయంలో ఆఫీస్ నుండి ఇంటికి బయల్దేరాడు. ఆ రోజు పెద్దగా ఆలోచనలు లేవు. ఆలోచనల్లో ఆకాంక్షలు లేవు... ఆ రోజు తన హృదయం వేగం తగ్గింది.., హృదయ వేగం తో పాటు బైక్ వేగమూ తగ్గింది. ఆ పయనం పరమ బోర్ గా సాగుతున్న సమయం. అప్రయత్నంగానే ఆలోచన ముందు రోజు చూసిన అమ్మాయి మీదకు వెళ్తుంది. కానీ మనసు వద్దని వారిస్తుంది. ఆలోచనే ఆలోచించమని అర్థిస్తుంది. మనసు రెండు వైపులా మారాం చేస్తూ ఆ మగువ కోసం మనసులోనే మౌనంగా మదన పడుతుంది. నిరుత్సాహంగానే ఆ యువకుడు సగం దూరాన్ని భారంగా చేరుకున్నాడు. ఒకానొక దగ్గర సిగ్నల్ పడటంతో ఓపిక తెచ్చుకొని మరీ ఆగిన సమయం... ఆ అమ్మాయి ఆలోచన నుండి మనసును మరిపించటానికి మస్థిష్కం మర్దన చేస్తున్న సమయం.... ఆవేశం అసహనం రెండూ అంతరాల్లోంచి ఎగసిపడుతున్న తరుణం..... యథాలాపంగానే ఆ అబ్బాయి చూపులు పక్కకి తిరిగాయి. ఆ చూపు ఒక మలుపు.. ఒక్కసారిగా అతని కళ్ళలో ఆశ్చర్యం. సరిగ్గా ముందు రోజు చూసిన అమ్మాయి.... పక్కనే పది అడుగుల దూరంలో ఉంది. ఒక్కసారిగా అబ్బాయి ఆవేశం ఆసక్తిగా, అసహనం ఆనందంగా మారింది. నరాలు జివ్వున లాగుతున్నట్లు అనిపించింది. ఒక మంచి అనుభూతి ఆకాశం లో నాట్యం చేస్తుంది. ఆలోచనలు అరక్షణంలో ఈ ప్రపంచాన్ని చుట్టేలా పరిగెడుతున్నాయి. హృదయం వేగమందుకుంది...... నిజంగా ముందు రోజు చుసిన అమ్మాయి మల్లి ఆ తర్వాత కనిపించటం యాదృచ్చికమే అయినప్పటికీ అన్ని కోట్ల మందిలో అదే అమ్మాయి మళ్ళి ఆతర్వాత కూడా అదే యువకుని కంటబడటం కూడా నిజంగా ఒక అద్భుతమే,ఇంకో పక్క ఆశ్చర్యమే....

అంతలో సిగ్నల్ పడటంతో  బైక్ తన వేగాన్ని పెంచుకొని గెలుపు గుర్రమై ఆ అమ్మాయనే గమ్యానికి పరుగులు పెడుతుంది. ఈ సారి ఎలాగైనా ఆ అమ్మాయి ని అందుకోవాలనే ఆతృత ఆసక్తి రెండూ కలగలసి మనసును తొందర పెడుతున్నాయి. అందుకే బైక్ వేగాన్ని పెంచి సరిగ్గా ఆమె బైక్ కి ముందు రెండు అడగుల దూరంలో ఆ యువకుడు వెళ్తున్నాడు.. ఆ యువకుని బైక్ అద్దంలో ఆ అమ్మాయి అందాన్ని ఆస్వాదించే విధంగా.... ఆ అమ్మాయి కూడా అబ్బాయిని గమనించింది. కాని ఆ అమ్మాయి ముఖంలో ఏ విధమైన హావభావాలు కనిపించలేదు. ఇంక ఆ అబ్బాయి తనను గుర్తించలేదేమో అన్న ఆందోళనతో కొంచెం తన బైక్ వేగాన్ని తగ్గించాడు. మళ్ళి ఆ అమ్మాయి వెనకగా వచ్చాడు. ఆ అమ్మాయి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. ఇంకా ఆ యువకుడి ఆనందం అధిరోహినై అంబరాన్నంటే విధంగా అవని హద్దులు చెరిపేస్తుంది. ఆ అమ్మాయి బైక్ కు ఉన్న అద్దంలో ఆమె వదనం వెన్నెలలా ప్రకాశిస్తుంది. అలానే చూస్తూ తన బైక్ వేగాన్ని పెంచాడు... ఈ సారి కూడా ఆమె తన కనుల నుండి కరిగిపోకుండా.... అదే సమయంలో ఆ అమ్మాయి బైక్ అద్దంలో ఆ అమ్మాయి పెదాలపై చిరునవ్వు ను గమినించాడు. ఒహో ఆ చిరునవ్వు చిద్విలాసమై చీకట్లు లేని చిన్న లోకాన్ని సృష్టించబోతుందన్నట్లుగా ఉంది. ఆ అధరాలపై అమృతాల్లాంటి పలుకులు కదలాడతాయని ఆ చిరునవ్వు కమనీయంగా కనిపించి చెప్తుంది...... అసలా అందం అద్భుతం చేత అద్భుతమని అనిపిస్తుంది. తను వెనకాల ఉన్నప్పుడు వయ్యారమైన ఆ వాలు జడ ఉంది చూడు ఆ జడ లోనే ఆమె అందమంతా దాగుందా అనిపిస్తుందా ఆ యువకునికి.. తను ఉన్న ఒక్క పది క్షణాలు ఆ అబ్బాయి ప్రపంచాన్ని మురిపించి మైమరిపించి తనను ఆసాంతం అయోమయంలో పడేసిన అమ్మాయికి, అమ్మాయి అందానికి ఆ అబ్బాయి (హృదయ) అంతరంలోనే అందానిభివందనం అర్పించాడు.

అలానే ఆ రెండు బైక్ లు తమ గమనాన్ని కొనసాగిస్తున్న సమయంలో, గమ్య స్థానం కూడా చేరువవుతున్న సమయంలో..,  ఈ సారి ఆ అమ్మాయిని ఎలాగైనా కలిసి మాట్లాడాలని యదలోపల యుద్ధం మళ్ళి ప్రారంభమైన తరుణంలో, ఆ అమ్మాయినే తన గమ్యస్థానంగా మార్చుకున్న వేళలో...  ఆ అమ్మాయి బైక్ నే ఆ యువకుడు అనుసరిస్తున్నాడు. ఆ సమయంలో ఆ అబ్బాయి మనసులో ఒకటే ఆలోచన.., ఆ అమ్మాయిని కలుసుకోవటం.., ఆ అమ్మాయి తన గమ్యస్థానానికి చేరువ కావటానికి సమయం ఆసన్నమైంది.

ఆ అమ్మాయి గమ్యస్థానం ఎక్కడ దగ్గరపడుతుందో అని అతని మనసు భారమవుతున్న వేళా.., చివరికి ఆ అమ్మాయి గమ్యస్థానం రానే వచ్చింది.., అమ్మాయి అలా తన బైక్ ఆపగానే ఆ అబ్బాయి ఈ లోకంలోకి వచ్చాడు, ఇంతకి ఇక్కడ విశేషం ఏంటంటే ఆ అమ్మాయి బైక్ ఎక్కడో ఆగలేదు, ఆ అమ్మాయి గమ్యస్థానం ఎక్కడో లేదు. ఆ అబ్బాయి ఉండే అపార్ట్ మెంట్ ముందుండే ఇంటిలో ఆ అమ్మాయి బైక్ ఆగింది. ఓ పక్క ఆనందం మరో పక్క భయం.. ఆ అమ్మాయితో ఎలా మాటలు కలపాలా అని...,  ఆ అమ్మాయితో ఒక్కసారి మాట్లాడితే బాగుండనిపిస్తుంది, అమ్మాయి దగ్గరికి వెళ్లాలా వద్దా.. వెళ్తే భయం అసలు ఏమవుతుందోనని..., ఆ సమయంలో ఆ అబ్బాయి గుండె చప్పుడు ఆ అబ్బాయికే వినిపించేంత నిశ్యబ్ద వాతావరణం ఆ పరిసరాల్లో, ఆ అబ్బాయిలో కూడా.., ఆ అమ్మాయి ఇంకా ఆ ఇంటిముందే ఉంది.., యదలోపల యుద్ధం తారాస్థాయికి చేరింది.. ఆ అబ్బాయికి వెళ్లి మాట్లాడాలనిపిస్తుంది., కాని మాట్లాడలేడు,  అప్పుడు ఆ అబ్బాయికి సంస్కారం అడ్డొస్తుంది.., భయం భయపెడుతుంది.. సంస్కార భయం సమాజ భయం రెండు ఉన్నాయి... ఇంకా ఆ ఆధ్యాయం అక్కడితో అంతం అయినట్లు అనిపించింది.. ఆ చిన్న ప్రేమ కథ అంతటితో ఆగిపోతుందని అనిపించింది... "చక్రాల" మీద పుట్టిన ప్రేమ జీవితమనే సహజ సిద్దమైన "చక్రంలో" కలిసిపోయిందని అనిపించింది. అప్పటికప్పుడు పుట్టే ప్రేమ ఎంత వరకు వాస్తవమో తెలియదు కాని..,  కొందరి జీవితాల్లో ఇలాంటి అనుకోని ప్రేమ సంఘటనలు సక్సెస్ అయిన సందర్భాలుంటాయి... లైఫ్ లో లక్షణంగా సెటిల్ అయి ఇంక కావాల్సిన తంతు ఒక్కటే మిగిలి ఉంది అని అనుకున్న ధైర్యశాలి ఇక్కడ ధైర్యం చేస్తాడు.. అడుగు ముందుకు వేసి అమ్మాయి దగ్గరకి వెళ్తాడు.. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఒప్పుకుంటుందా లేకపోతే ఒక ఓర చూపు చూసేసి వెళ్ళిపోతుందా అనేది ఆ తర్వాత ఆలోచన.. అప్పటికప్పుడు అక్కడ కావాల్సింది అడుగు వేయటం...  ధైర్యం చేయటం....

(దీనిలో మిగతా భాగం కొనసాగితే కచ్చితంగా ఆ కమ్మని కథను మీకు చేర వేస్తాను)

హరికాంత్ :-)