కన్ను తెరిస్తే జననం... కన్ను మూస్తే మరణం రెప్ప పాటు కాలమే జీవితం సుప్రసిద్ద కవి అన్న మాటలు ఒక్కసారిగా గుర్తొచ్చాయి. సృష్టిలో మనిషి దేనికన్నా భయపడతాడు అంటే అది ముమ్మాటికి చావుకే. చావంటే భయం అనటం కన్నా బ్రతుకు అంటే ప్రీతీ అనటం ఇంకా బాగుంటుందేమో.
చిన్నప్పుడు ఎవరైనా అందరూ బంధువులు వస్తున్నారు అంటే చాలా ఆసక్తిగా ఉండేది. అందరం కలుస్తామన్న ఆనందం ఉండేది. కాని జీవిత కాలానుక్రమంలో అనుభవాలు అన్ని నేర్పాయి. కాసుల వేటలో పడి కాలాన్ని, కాలంతో పాటు కాదనుకున్న వాళ్ళని మర్చిపోయాను. డబ్బులో అందాన్ని, ఆనందాన్ని, ఆప్యాయతను వెతుక్కున్నాను. ఇప్పటికి నాకు ఏదైనా శుభకార్యం అంటే ఎందుకో వెళ్ళటానికి అసలు మనసొప్పదు. కాని ఒక మనిషి సంతోషంలో ఉంటే పట్టించుకోనవసరం లేదు కాని దుఃఖంలో ఉంటె మాత్రం ఒదార్చటం, ధైర్యం చెప్పటం చాలా గొప్ప విషయంగా అనిపిస్తుంది. అందుకే నాకు కావాల్సిన వాళ్ళు సంతోషంలో ఉన్నారంటే వెళ్ళటానికి ఇష్టపడను కాని బాధలో ఉంటె మాత్రం వెళ్ళటానికి ప్రయత్నిస్తాను.
ఈ మధ్య నేనొక చావుకి వెళ్లాను. ఆ చనిపోయిన వ్యక్తి నాకు దగ్గర వ్యక్తి కానప్పటికీ, ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరుండే వ్యక్తి నాకు కావాల్సిన వ్యక్తి కావటంతో వెళ్ళవలసి వచ్చింది. దహనం అయిపోయాక సరిగ్గా పదకొండు రోజులకు కర్మ నిర్వహించారు. ఆ కర్మకు వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళాను సరే అక్కడ ఏర్పాట్లు చూసి అవక్కాయిపోయి ఆనందపడ్డాను. సరిగ్గా పెళ్లి ఏర్పాట్లకు ఎక్కువ కాకుండా ఒక పెద్ద వేడుకకు తక్కువ కాకుండా హౌరా అనిపించారు.
హరికాంత్ రెడ్డి